
ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం
చారకొండ: సీర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి ఆలయానికి సంబంధించి సర్వే నెం 327, 328 భూమిలో గతంలో అక్రమంగా నిర్మించిన 34 ఇళ్లను హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 19న తొలగిస్తామని దేవదాయఽ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీర్సనగండ్ల ఆలయ ఆవరణంలో గుట్ట దిగువన ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై తహసీల్దార్ సునీత ఆధ్వర్యంలో బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆలయ భమిలో ఇళ్లు నిర్మించుకున్న 34మందికి ఇళ్లు ఖాళీ చేయాలని గతంలో నోటీసులు అందించినట్లు తెలిపారు. గడువు మేరకు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేసి అధికారులు, దేవాదాయ శాఖకు సహకరించాలని కోరారు. దాంతో బాధితులు ఉన్నఫలంగా తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోమంటే ఎక్కడికెళ్లాలి, కొన్ని ఏళ్లుగా ఇక్కడే ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నాం.. ఇళ్లను తొలగించొద్దని వేడుకున్నారు. అధికారులు ఖాళీ చేయాల్సిందేనని తెల్చడంతో ప్రత్యామ్నాయంగా మరోచోటు చూసుకునేవరకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులకు కొంత సమయం కావాలని వినతిపత్రం అంజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు. సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ శంషోద్దిన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీణధరి, ఈఓ ఆంజనేయులు, ఆర్ఐ భరత్, అధికారులు ఉన్నారు.
దేవాదాయ, ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి
కొంత సమయం కావాలని అధికారులకు బాధితుల వినతి