
సహకార బ్యాంకు ఖాతాదారులకు యూపీఐ సేవలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులతో త్వరలోనే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఖాతాదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మహాజన సభలో చైర్మన్ మాట్లాడారు. ఈ సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు డిపాజిట్లు రూ. 443 కోట్లకు చేరుకున్నాయని.. ఇప్పటి వరకు రూ. 685 కోట్ల స్వల్పకాలిక, రూ. 468 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు ఇచ్చామని వెల్లడించారు. అదే విధంగా వివిధ ప్రయోజనాల కోసం రైతులు, ఖాతాదారులకు వ్యవసాయేతర రుణాలు అందిస్తున్నామన్నారు. రుణ వసూళ్లలో ప్రగతిని కనబరుస్తూ.. ఆర్బీఐ నుంచి వీక్ బ్యాంకు స్టేటస్ తొలగిపోయేలా ఉద్యోగులు కృషి చేశారన్నారు. హన్వాడ రైతు సేవా సహకార సంఘాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంగా డీసీసీబీకి అనుసంధానం చేస్తూ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాగా, జీఓ 44 రద్దు కోసం కృషిచేసిన డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డిని సింగిల్విండో చైర్మన్లు భూపాల్రావు, భాస్కర్రెడ్డి ఘనంగా సన్మానించారు. సమావేశంలో వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి జ్యోతిరాణి, డైరెక్టర్లు, పీఏసీఎస్ల చైర్మన్లు తదితరులు ఉన్నారు.
డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి