
వ్యాధుల ముప్పు.. అప్రమత్తతే మందు
● అర్బన్ ఏరియాలోనే అధిక కేసులు నమోదు
● ఇప్పటికే జిల్లాలో మొదలైన వర్షాలు
● దోమలు వృద్ధితో సీజనల్ వ్యాధుల ముప్పు
● నివారణకు కార్యాచరణ ప్రకటించిన ఆరోగ్య శాఖ
పాలమూరు: జిల్లావ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పారిశుద్ధ్య లోపం, తినే ఆహారం కారణంగా ఇవి దరిచేరుతాయి. వర్షాలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీనికితోడు వాతావరణంలో అనూహ్య మార్పులు ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా జ్వరాల దరువు మొదలైంది. వారం రోజులుగా ఆస్పత్రుల్లో పరిస్థితులను పరిశీలిస్తే.. సాధారణ రోజుల కంటే 10 శాతం అవుట్ పేషెంట్ (ఓపీ)లు పెరిగారు. వీరిలో 70 శాతం జ్వరపీడితులే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది.
అపరిశుభ్రత.. వాతావరణ మార్పులు
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముందుగానే రావడంతో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. సీజనల్ వ్యాధులకు.. దోమల దండయాత్రకు వానాకాలం అనుకూలం. దోమలను నియంత్రించగలిగితే సగం వ్యాధులు దూరమవుతాయి. ముఖ్యంగా దోమకాటు వల్ల జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువ. మలేరియా, డెంగీ, గన్యా వంటి వ్యాధులు సోకుతాయి. దోమలు ప్రధానంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, మురుగు కాల్వలు, చెత్త, అపరిశుభ్రత వాతావరణంలో గుడ్లుపెట్టి సంతతిని వ్యాప్తి చేస్తాయి. ఇలాంటి ప్రాంతాలను గుర్తించి దోమల నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలి..
● గతేడాదితోపాటు ప్రస్తుతం వస్తున్న సీజనల్ వ్యాధులు అధిక సంఖ్యలో కేసులు మహబూబ్నగర్ అర్బన్ ఏరియాలో నమోదవుతున్నాయి. 70 శాతం కేసులు అర్బన్లో వస్తే.. 30 శాతం రూరల్ ఏరియాలో రావడం విశేషం. ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణంలోని భగీరథకాలనీ, బీకేరెడ్డికాలనీ, రామయ్యబౌళి, మర్లు, ప్రేమ్నగర్, వీరన్నపేటతోపాటు శివారులో వెలుస్తున్న నూతన కాలనీల్లో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో వ్యాధులు సోకుతున్నాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 58 డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం.
● ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఓపీ కేసులు 1,61,016 ఉండగా.. ఐపీ కేసులు 13,221 ఉన్నాయి. ఈ నెల మొదటి వా నుంచి ఓపీతో పాటు ఐపీ కేసులు కొంత మేర పెరిగాయి.