
మిగిలిన పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలి హెచ్ఎంలుగా పదోన్నతులు ఇచ్చిన తర్వాత మిగిలిన పోస్టులు, రిటైర్డ్ అయ్యాక ఖాళీ అయిన పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ను హైదరాబాద్లో కలిసి విన్నవించారు. ఈమేరకు ఇటీవల నియమితులైన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బడులు సమర్థవంతంగా నిర్వహించేందుకు జోన్ –2లో ఖాళీగా ఉన్న 750 పోస్టులను వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీటితో పాటు పండిట్, పీఈటీలను అప్గ్రేడ్ చేయగా మిగిలిన 507 పోస్టులను వెంటనే అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పౌజ్ ఫోరం అధ్యక్షులు వివేక్, టీపీఆర్టీయూ నాయకులు శ్రవణ్, నిజాముద్దీన్ పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై గాల్లోకి ఎగిరిన కారు
జడ్చర్ల: జడ్చర్ల శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం కారు అతి వేగంతో గాల్లోకి ఎగిరి ఓ చెట్టుపై పడిన సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న కారు కావేరమ్మపేట వద్దకు వచ్చే సరికి ఒక్కసారిగా కారు గాలిలోకి దాదాపు పది అడుగుల పైకి ఎగిరి రహదారిపై ఉన్న ఓ చెట్టు కొమ్మలపై పడింది. కొమ్మలు విరిగి కిందకు పడిన కారులో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన డ్రైవర్ రామయ్య స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కన దాబా నుంచి ఓ కారు అకస్మత్తుగా జాతీయ రహదారిపై అడ్డు రావడంతో బ్రేక్ వేయబోయి ఎక్స్లేటర్ తొక్కడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని డ్రైవర్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది.