
పట్నం వెళ్దామని.. ఆత్మకూర్లో దింపాడు
ఆత్మకూర్: మనిషన్నవాడు మాయమైపోతున్నాడు.. నవమాసాలు మోసి కనీ పెంచి ప్రయోజకుడిని చేసిన కన్నతల్లిని బస్టాండ్లో వదిలేశాడో కసాయి కొడుకు.. ఈ హృదయ విధారక ఘటన ఆత్మకూర్లో చోటుచేసుకుంది. వివరాలిలా.. వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టకాలనీలో నివాసముంటున్న పార్వతమ్మను(60) కుమారుడు భాస్కర్ హైదరాబాద్కు తీసుకెళ్తానని మూడురోజుల క్రితం ఆర్టీసీ బస్సులో తీసుకొచ్చాడు. ఆత్మకూర్ బస్టాండ్లో దించి ఇక్కడే కూర్చోమని.. అరగంటలో వస్తానని చెప్పి పత్తాలేకుండా ఉడాయించాడు. తీర ఎంతరాత్రయినా రాకపోవడంతో తోటి ప్రయాణికుల సహాయంతో కుమారుడికి ఫోన్ చేయగా.. పొద్దున్నే వాస్తానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మూడురోజులుగా కనిపించిన ప్రతి ప్రయాణికుడిని తనవద్ద ఉన్న కాగితం ముక్క చూయిస్తూ తన కుమారుడికి ఫోన్ చేయాలని కోరుతూ.. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో కన్నీరు మున్నీరు అవుతుంది. పార్వతమ్మ కాళ్లకు గాయం కావడంతో బస్సు ఎక్కలేక, ఎక్కడికి వెళ్లలేక కంటతడి పెడుతూ బస్టాండ్లోనే బిక్కుబిక్కుమంటూ మూడు రోజులుగా కుమారుడి కోసం ఎదురుచూస్తోంది. వనపర్తిలోని తమ బంధువులు స్పందించి తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని వేడుకుంటుంది.
అరగంటలో వస్తానని మూడు రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్
కన్నతల్లిని బస్టాండ్లో వదిలేసిన కసాయి కొడుకు
కాళ్లకు గాయాలతోవృద్ధురాలి కన్నీరుమున్నీరు
బంధువులైనా తీసుకెళ్లాలని వేడుకోలు