
జూరాలకు జలకళ
ధరూరు/ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో పైనుంచి ఇన్ఫ్లో పెరిగిందని.. 50వేల క్యూసెక్కులు వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు 21వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. సోమవారం రాత్రి 7:30 గంటల వరకు 50వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 23, 957 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, కోయిల్ సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 63 క్యూసెక్కులు మొత్తం ప్రాజెక్టు నుంచి 25,835 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.184 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
● జూరాల ప్రాజెక్టుకు దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈమేరకు సోమవారం 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతునట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్లు, 25.144 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 27.700 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 52.844 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.
ఎగువన కురిసినవర్షాలకు పెరిగిన ఇన్ఫ్లో
ప్రాజెక్టులోకి 50వేల క్యూసెక్కుల వరద
దిగువకు 25,835 క్యూసెక్కులు విడుదల