
జూరాలకు 21 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 21 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు పీజేపీఅధికారులు తెలిపారు. శనివారం 15వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 9 గంటలకు 21వేల క్యూసెక్కులకు పెరిగిందని పేర్కొన్నారు. విద్యదుత్పత్తి కోసం 15,804 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 1,500 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 57 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 17,676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం6.081 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జన్కో ఎగువ, దిగువ జల విద్యుత్కేంద్రంలో 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతున్నట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్లు, 22.448 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 24.376 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్ప టివరకు 46.824 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.