నాగర్కర్నూల్ క్రైం: లింగాల పోలీస్స్టేషన్లో ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించడం.. అందులో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నేపథ్యంలో ఎస్ఐ జగన్ను వనపర్తి జిల్లా వీఆర్కు అటాచ్ చేస్తూ జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. లింగాల మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు ఈ నెల 13న ఓ పెట్రోల్బంక్ నిర్వాహకులతో గొడవ పడ్డారు. సదరు పెట్రో ల్బంక్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులను స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పోలీస్స్టేషన్లోనే యువకులు తల దువ్వుకోవడంతో ఆగ్రహించిన ఎస్ఐ జగన్.. ముగ్గురికి శిరోముండనం చేయించారు. శిరోముండనం చేయించడాన్ని తట్టుకోలేక పోయిన ఓ యువకుడు ఈ నెల 18న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య యత్నించగా.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్ఐ జగన్ను వనపర్తి జిల్లా వీఆర్కు అటాచ్ చేస్తూ జోగుళాంబ జోన్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.