గూడ్స్‌ రైలు నుంచి విడిపోయిన బోగీలు | - | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ రైలు నుంచి విడిపోయిన బోగీలు

Jul 21 2023 1:02 AM | Updated on Jul 21 2023 9:02 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: రన్నింగ్‌లో ఉన్న గూడ్స్‌ రైలు నుంచి బోగీలు విడిపోయిన సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలంలోని ఆరేపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం కర్నూలు వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు ఓ గూడ్స్‌ రైలు వెళుతుండగా 11.15గంటల సమయంలో దానికి సంబంధించిన బోగీలు విడిపోయాయి.

ఇది గమనించకపోవడంతో ఇంజన్‌ ఇంచార్జ్‌ రైలును అలాగే ముందుకు తీసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన గూడ్స్‌రైలు గార్డు వాకీ టాకీ ద్వారా లోకో పైలెట్‌కు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు గూడ్స్‌ రైలు ముందుకు వెళ్లిపోయింది. వెంటనే ఇంజన్‌ను ట్రాక్‌పై వెనక్కి తీసుకొచ్చి బోగీలను జోడించుకుని 20 నిమిషాల్లో మళ్లీ ముందుకు బయల్దేరింది.

ఘటన జరిగిన సమయంలో గుంటూరు, తుంగభద్ర రైళ్లు రావాల్సి ఉండగా.. ముందస్తు సమాచారంతో వాటిని కాసేపు నిలిపివేశారు. బోగీలకు మధ్య ఉన్న హెయిర్‌పంపు కప్‌ లింగ్‌ ఊడిపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement