మహబూబాబాద్ రూరల్/నెహ్రూసెంటర్ : గంజాయి, మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, ఆటో అడ్డా, ఆర్టీసీ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తుపదార్థాల విని యోగంపై సోదాలు చేపట్టి గంజాయి వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు.
గంజాయి స్వాధీనం
నెల్లికుదురు : మండలంలోని కాచికల్ స్టేజి వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా 40 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. తొర్రూర్ మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన వేల్పుల సుమంత్, గోపాలగిరికి చెందిన ధర్మారపు వంశీ గంజాయి తాగుతూ కనిపించినట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయించే నెల్లికుదురుకు చెందిన సందీప్ పరారీలో ఉన్నట్లు, ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉపాధ్యాయుడికి గాయాలు
మరిపెడ: బొలెరో వాహనం ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలైన సంఘటన మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని సూర్య పెట్రోక్ బంక్ సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బి.రాజు విధులు ముగించుకుని బైక్పై మరిపెడకు వెళ్తున్నాడు. ఈక్రమంలో వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెలుతున్న బొలెరో వాహనం ఉపాధ్యాయుడి బైక్ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఉపాధ్యాయుడు రాజు తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.


