అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌

Apr 2 2026 8:34 AM | Updated on Apr 2 2026 8:34 AM

వరంగల్‌ క్రైం: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ముఠాను అరెస్ట్‌ చేసి రూ.15.20 లక్షల విలువైన 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. బుధవారం కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఇద్దరి నిందితుల అరెస్ట్‌ చూపి వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని మదురైకి చెందిన కల్యాణ సుందరం గంజాయి విక్రయాలతోపాటు బైక్‌ చోరీలకు పాల్పడిన కేసులో జైలుశిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత సెల్‌ ఫోన్‌ షాపులో సేల్స్‌ మెన్‌గా పనిచేస్తున్న సమయంలో మదురైకి చెందిన సెల్వ రాజ్‌తో పరిచయమైంది. ఇరువురు కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. ఆదాయం సరిపోకపోవడంతో ఒంటరి మహిళలను లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేందుకు గత నెల వరంగల్‌కు చేరుకున్నారు. ప్లాన్‌ ప్రకారం మట్టెవాడ పీఎస్‌ పరిధిలో బైక్‌ చోరీ చేసి, దానిపై ప్రయాణిస్తూ సుబేదారి, హనుమకొండ, కేయూ పీఎస్‌లతోపాటు ఏపీలోని కర్నూల్‌తో కలుపుకొని మొత్తం ఐదు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్ప డ్డారు. ఈ చోరీలపై కేసు నమోదు చేసిన పోలీసులు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు మరోమారు బుధవారం చైన్‌ స్నాచింగ్‌ చేయడానికి వరంగల్‌ వచ్చారు. బైక్‌పై హనుమకొండ బస్టాండ్‌ నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ వైపునకు వస్తున్న క్రమంలో పోలీసులు వారిని పటుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసినట్ల సీపీ తెలిపారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత, అడిషనల్‌ క్రైమ్‌ డీసీపీ జి.బాలస్వామి, క్రైమ్‌ ఏసీపీ పి. సదయ్య, హనుమకొండ ఏసీపీ పి.నర్సింహరావు, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ అభినందించారు.

ఇద్దరు దొంగలు అరెస్ట్‌..

తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్‌ చేసి వారి నుంచి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, సెల్‌ఫోన్లు, వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. నగరంలోని కొత్తూరు జెండాకు చెందిన బింగి రఘు, బొక్కలగడ్డకు చెందిన మహ్మద్‌ అసద్‌.. నిర్మాణంలో ఉన్న ఇళ్లలో, తాళం వేసి ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం హనుమకొండ బస్టాండ్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడతున్నట్లు అంగీకరించారు. దీంతో చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని అరెస్ట్‌ చేసినట్లు సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వివరించారు.

95 గ్రాముల బంగారం స్వాధీనం

వివరాలు వెల్లడించిన సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement