కురవి : టిప్పర్ ఢీకొని ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామంలోని 365/ఏ జాతీయ రహదారిపై జరిగింది. సీరోలు ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాగటి పద్మ(50) మంగళవారం రాత్రి తన ఇంటి ఎదుట నిలబడి ఉంది. ఈ క్రమంలో టిప్పర్.. ఆమెను ఢీకొని ఆగకుండా వెళ్లింది. ఈ ఘటనపై స్థానికులు అదే రాత్రి సీరోలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీరోలు ఎస్సై సంతోష్ సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించగా టిప్పర్ ఆచూకీ లభ్యమైంది. దీంతో డ్రైవర్ నర్సింహస్వామి అరెస్ట్ చేసినట్ల ఎస్సై సంతోష్ బుధవారం తెలిపారు.
న్యాయం చేయాలని ధర్నా..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగటి పద్మ కుటుంబీకులకు న్యాయం చేయాలని గ్రామస్తులు, బాధితులు సీరోలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళన చేసిన వారిలో ఉపేందర్, సంపత్, రామన్న, వెంకన్న తదితరులు ఉన్నారు.
ఉప్పరిగూడెంలో ఘటన
న్యాయం చేయాలని పీఎస్ ఎదుట ధర్నా


