
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
పెద్దవంగర: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాజ్మాన్ సింగ్ తండాలో 12 ఏళ్ల క్రితం మూతపడిన ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ బుదారపు శ్రీనివాస్తో కలసి డీఈఓ పునఃప్రారంభించారు. తండా వాసులతో మాట్లాడారు. అనంతరం అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కాసేపు పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. పబ్లిక్ పరీక్షలకు ఇప్పటి నుంచే ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏ రకమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. అధికారులు రాజేంద్రప్రసాద్, చంద్రశేఖర్ ఆజాద్, హెచ్ఎం కళాధర్, ఏపీఎం రమణాచారి, మహిళా సమైక్య సంఘం అధ్యక్షురాలు భద్రమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యా బోధనే లక్ష్యం
డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధించి ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యమని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. డోర్నకల్ జెడ్పీహెచ్ఎస్లో సబ్జెక్టుల వారీగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ శాఖలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు పాఠశాలలో ప్రత్యేక డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే అమ్మపాలెం ప్రభుత్వ పాఠశాలకు ఓ ప్రవాస భారతీయుడు అందజేసిన డ్యూయల్ బెంచీలను డీఈఓ ప్రారంభించారు. జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఏఎండీ ఆజాద్ చంద్రశేఖర్, ఎంఈఓ ఆంగోత్ లక్ష్మానాయక్, హెచ్ఎం బండి నర్సింహారావు, శ్రీలక్ష్మి, వీరన్న, శోభారాణి, త్రివేణి పాల్గొన్నారు.
అధిక భారం మోపొద్దు
మహబూబాబాద్ అర్బన్: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనిభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజులు, దుస్తులు టై,బెల్టులు, షూలు, పుస్తకాలు పేరుతో అధిక భారం మోపి ఇబ్బందుల గురి చేస్తే చర్యలు తీసుకుంటామని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలల ఆవరణలోనే దుస్తులు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు అమ్మకాలకు తెరతీశారని, అధిక ధరలకు అమ్ముతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకుల నుంచి ఆరోపణలు వచ్చాయన్నారు. నిబంధనల మేరకు అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం రూపొందించిన పుస్తకాల ద్వారానే బోధించాలని సూచించారు.
తెరుచుకున్న బడి..
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని హజారియాతండా ఎంపీపీఎస్ పాఠశాల 12 సంవత్సరాలుగా మూతపడి ఉంది. డీఈఓ రవీందర్ రెడ్డి ప్రోత్సాహంతో బుధవారం పునఃప్రారంభించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రాజేంద్రప్రసాద్, ఎంఈఓ ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా అకాడమీ మానిటరింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, పర్వతగిరి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మందుల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్ రెడ్డి