
ఓసీ–3లో నిలిచిన పనులు
గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పరశురాంపల్లి శివారు ఓసీ–3 ప్రాజెక్టులో బొగ్గు తవ్వకం పనులు సోమవారం ఉదయం ఫస్ట్ షిఫ్ట్ నుంచి పూర్తిగా నిలిచాయి. ఓసీ–3 గనిలో తవ్వకం పనులు చేపట్టిన ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కంపెనీకి సింగరేణి యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో పనులు కంపెనీ పూర్తిగా నిలిపివేసింది. సుమారు రూ.4 కోట్ల వరకు సింగరేణి సంస్థ ఎస్వీఎస్ కంపెనీకి చెల్లించాల్సి ఉంది. అయితే ఆ డబ్బులు చెల్లించక పోవడంతో బొగ్గు, మట్టి తవ్వకం పనులు నిలిపి వేశారు. డబ్బులు చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని కంపెనీ యంత్రాలు, లారీలను ఎక్కడిక్కడే నిలిపి వేసింది. రోజుకు 3వేల టన్నుల బొగ్గు, 4వేల టన్నుల మట్టి తవ్వకం పనులు నిలిచి పోవడంతో సింగరేణి సంస్థ భారీగా నష్టపోతుంది.
సింగరేణి యాజమాన్యం డబ్బులు చెల్లించలేదని పనులు నిలిపిన కంపెనీ