
ప్రాణం తీసిన భూ వివాదం
● రెండు గుంటల భూమే కారణం...
● మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య
● చిట్యాలలో ఘటన
చిట్యాల: భూ వివాదం ప్రాణం తీసింది. రెండుగుంటల భూమి కోసం కొన్ని రోజులుగా జరుగుతున్న గొడవతో మనస్తాపం చెందిన ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పా ల్పడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కట్కూరి మధునమ్మ(65)కు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా కొంత భూమి వచ్చింది. ఇందులో రెండు గుంటల భూమిని తన అన్న కుమారుడి(మేనల్లుడు)కి ఇవ్వాలని తన కుమారులు రమేశ్, శ్రీనివాస్ను కోరింది. ఈ విషయంపై వారు అంగీకరించకపోవడంతో కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో పంచాయితీ జరిగింది. అయినా కుమారులు వినడం లేదు. దీనిపై మనస్తాపం చెందిన మధునమ్మ ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు గమనించి హుటహుటిన పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు అర్ధరాత్రి మృతి చెందింది. కాగా, మధునమ్మ మృతికి కారణమైన కుమారులపై కేసు నమోదు చేయాలని ఆస్పత్రి ఆవరణలో కాలనీ వాసులు, బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మధునమ్మ మృతిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతురాలి కుమార్తె రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై శ్రవణ్కుమార్ సోమవారం తెలిపారు.