లడ్డూల మిస్సింగ్‌పై చర్యలేవీ! | - | Sakshi
Sakshi News home page

లడ్డూల మిస్సింగ్‌పై చర్యలేవీ!

Jun 11 2025 11:34 AM | Updated on Jun 11 2025 11:34 AM

లడ్డూల మిస్సింగ్‌పై చర్యలేవీ!

లడ్డూల మిస్సింగ్‌పై చర్యలేవీ!

కాళేశ్వరం: పన్నెండేళ్లకొకసారి వచ్చే సరస్వతీనది పు ష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రూ.35కోట్లు మంజూరు చేసి 12 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించింది. మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన పుష్కరాలకు సుమారు 20లక్షలకుపైగా మంది భక్తులు హాజరయ్యారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేశారు. ఫలితంగా కాళేశ్వరాలయానికి రూ. 1.33 కోట్లు ఆదాయం సమకూరింది. అయితే ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి వద్ద విక్రయించిన లెక్కల్లో ఆరు వేల లడ్డూలకు సంబంధించి తేడాలు రావడంతో దేవస్థాన ఈఓ మహేశ్‌ సదరు ఉద్యోగికి నోటీసుచ్చి సంజాయిషీ ఇవ్వాలని కోరగా, అతడి నుంచి స్పందన లేదని తెలిసింది. 9న మరో నోటీసు ఇచ్చారు. దీంతో దేవస్థానంలో మరికొన్ని లడ్డూలకు సంబంధించిన స్టాక్‌లో లెక్కలు లభించినట్లు తెలిసింది. సదరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని లెక్కల్లో తక్కువ వచ్చిన లడ్డూలకు సంబంధించి రూ.2.38 లక్షల వరకు చెల్లించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. లేదంటే ఉద్యోగం నుంచి తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో నగదు చెల్లిస్తే తానే లడ్డూల నగదును తీసుకున్నట్లు అవుతుందని ఆ ఉద్యోగి డబ్బులు చెల్లించడానికి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. లడ్డూల మిస్సింగ్‌ అంశంపై ఎవరిపై చర్యలు తీసుకుంటారో తెలియక దేవస్థానం సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు.

లెక్క ప్రకారమే..

లడ్డూలు స్టోర్‌రూమ్‌ నుంచి విక్రయాలు జరిగే గది వరకు సంబంధిత ఇన్‌చార్జ్‌ లెక్క ప్రకారం సంబంధిత సదరు ఉద్యోగికి చేరవేస్తాడు. మధ్యలో చేరవేయడానికి వలంటీర్లు తీసుకెళ్తారు. వారి వద్ద ఏమైనా లెక్కలు తగ్గాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 12 రోజుల సీసీ ఫుటేజీని పరిశీలించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భక్తులు పేర్కొంటున్నారు.

ప్రసాదం అందరికీ..

పుష్కరాల 12 రోజుల సమయంలో ఎండోమెంట్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, పోలీసు, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, టూరిజం శాఖలు, జర్నలిస్టులతో పాటు ప్రైవేట్‌ సంస్థల నుంచి సుమారు 3వేల మందికిపైగా విధులు నిర్వర్తించారు. వీరిలో కొంత మంది విధులు ముగిసిన తర్వాత ఒక్కొక్కరు రెండు–మూడు లడ్డూల ప్రసాదం తీసుకెళ్లారు. వారికి లడ్డూల విడిగా ఇచ్చేవారు. ఇక్కడ మిస్సయినవి మాత్రం సింగిల్‌ బాక్స్‌, డబుల్‌ బాక్స్‌ల్లో ఉండే లడ్డూలు. ఇలా ఎక్కడ లెక్కలు మిస్సింగ్‌ అయ్యాయో తెలియాల్సి ఉంది. పుష్కరాలు ముగిసి 21 రోజులు గడుస్తున్నా లెక్కలు తేలకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎవరిని బాధ్యులను చేస్తారో అని దేవస్థానం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఈవిషయమై కాళేశ్వరం దేవస్థానం ఈఓ శనిగెల మహేశ్‌ను ఫోన్‌లో సంప్రదించగా..6వేల లడ్డూలు లెక్కల్లో తక్కువ వచ్చాయన్నారు. అందులో కొంత లడ్డూలకు సంబంధించి లెక్కలు లభించాయన్నారు. మిగతా లడ్డూలకు సంబంధించిన నగదు చెల్లించాలని సదరు ఉద్యోగికి గడువు ఇచ్చినట్లు తెలిపారు.

సరస్వతీనది పుష్కరాలు ముగిసి

21 రోజులు గడచినా తేలని లెక్కలు

లెక్కల్లో 6వేల లడ్డూలు తక్కువ

రావడంపై దేవస్థానంలో చర్చ

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపై వేటుకు

రంగం సిద్ధం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement