● వెంటనే చర్యలు తీసుకోవాలి
● పీజీఆర్ఎస్లో
కై రుప్పల బాధితుల ఫిర్యాదు
కర్నూలు(సెంట్రల్): మంత్రి లోకేష్ పేరు చెప్పి ఆస్పరి మండలం కై రుప్పల గ్రామ టీడీపీ నాయకుడు కమ్మరి వరప్రసాదు అనే వ్యక్తి భూములు కాజేస్తున్నారని, ఆయన స్వాధీనం నుంచి తమ భూములను తమకు ఇప్పించాలని అదే గ్రామానికి చెందిన కమ్మర గాయత్రీదేవి, సంధ్యారాణి అనే మహిళలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జెడ్పీ సీఈఓ వెంకటరమణారెడ్డి, అభియాన్ ఏపీసీ లోక రాజు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
మొత్తం 440 అర్జీలు
పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి మొత్తం 440 అర్జీలు వచ్చాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించే దాదాపు 150కిపైగా అర్జీలు ఉన్నాయి. పెన్షన్ల కోసం సుమారు 50కిపైగా అర్జీలు వచ్చాయి. అర్జీలకు సరైన పరిష్కారాలు చూపాలని, రీ ఓపెన్, ఇంప్రాపర్ రెడ్రసల్ కేసులను పూర్తిగా తగ్గించాలని అధికారులకు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ సూచించారు. కాగా.. ఈనెల 24న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులైన కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్ ఏర్పాట్లలో ఉన్నారు. దీంతో జిల్లా స్థాయి అధికారులే ఫిర్యాదులను స్వీకరించాల్సి వచ్చింది.
మా చావులకు అధికారులే కారణం!
తాము జీవనోధిపాధి కోసం గ్రామంలో లేకపోవడంతో కమ్మర వరప్రసాదు తమ భూములను వారి పేరిట ఆన్లైన్ చేయించుకున్నారని కమ్మర గాయత్రీదేవి, సంధ్యారాణి అనే మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు ఆయన పేరిట తమ భూములను ఆన్లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని కన్నీటి పర్యంతమయ్యారు. వాటిని వెంటనే రద్దు చేసి తమ పేరిట మార్చాలని కోరారు. లేదంటే తమ చావులకు అధికారులే కారణమవుతారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


