● కర్నూలులో 39, నంద్యాలలో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వానాకాలం వచ్చి 22 రోజులవుతున్నా ఎండాకాలంగానే కనిపిస్తుండటం గమనార్హం. ఇటీవల వర్షాలు కొంతవరకు మురిపించినప్పటికీ.. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. దీంతో వర్షాలు కనుమరుగై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భూములను సిద్ధం చేసుకున్నారు. విత్తనం విత్తుకోవడానికి వానలు కరువయ్యాయి. సాధారణంగా ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకు మాత్రమే నమోదవుతాయి. కానీ కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.9 డిగ్రీలు నమోదయ్యాయి, నంద్యాలలో గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలు నమోదయ్యాయి. సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా.. 96.3 మిమీ వర్షపాతం నమోదైంది. 10 రోజులుగా చినుకు జాడ లేకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఆగస్టు వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.


