కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నీట్–యూజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత పరీక్ష హాలులోకి అనుమతించబోమన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో నీట్–యూజీ పరీక్షలకు ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో 4,995 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా కేంద్రాలకు అనువుగా రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతోందన్నారు. జిల్లాలో అత్యధిక శాతం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేశామని, ఎస్ఐఆర్ ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. రాజకీయ పార్టీలు బీఎల్ఓలకు సహకరించాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈనెల 24న తుగ్గలి మండలం జొన్నగిరిలో జియో మైసూరు సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన గోల్డ్ మైన్స్ ప్రాజెక్టును ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు.


