● జిల్లా జడ్జి జి.కబర్ధి
కర్నూలు(టౌన్): ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్జి జి.కబర్ధి తెలిపారు. బుధవారం ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రత్యేక సెల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యాభ్యాసం, ఉపాధి నిమిత్తం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల సంక్షేమానికి న్యాయ సహాయ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, న్యాయవాదులు లక్ష్మీనారాయణ, శివరాం, సులోచన, ఓం ప్రకాష్ పాల్గొన్నారు.
ఖైదీలకు న్యాయసహాయం అందిస్తాం
జైలులో ఉన్న ఖైదీలు వారికున్న హక్కులను తెలుసుకోవాలని, ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. బుధవారం జిల్లా జైలులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ను, ములాఖత్ హెల్ప్ డెస్క్ను తనిఖీ చేశారు. ఖైదీలను కోర్టు వాయిదాలకు కచ్చితంగా హాజరుపర్చాలని ఆదేశించారు. లీగల్ ఎయిడ్ న్యాయవాదులు శివరాం, సులోచన, హెల్ప్డెస్క్ న్యాయవాది ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.


