● హాజరుకానున్న రాష్ట్ర హైకోర్టు
న్యాయమూర్తులు
కర్నూలు: జిల్లాకు కొత్తగా మంజూరైన న్యాయస్థానాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కర్నూలులో నూతనంగా 5వ, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్, జిల్లాకు చెందిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి, జస్టిస్ ఎ.హరిహరినాథ శర్మలు ప్రారంభించనున్నారు. కొత్త కోర్టుల ప్రారంభానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి వారం రోజులుగా స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రస్తుతానికి రెండు కోర్టులను కర్నూలు, నాలుగు కోర్టులను నంద్యాలలో, నందికొట్కూరులో ఒకటి తయారు చేయించారు. కర్నూలులో మరో అదనపు జిల్లా కోర్టు, మరో రెండు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ప్రారంభం కోసం భవనాల అన్వేషణ జరుగుతోంది. త్వరలో కొత్తగా మంజూరైన అన్ని కోర్టులను ప్రారంభించేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా కృషి చేస్తున్నారు. శనివారం ఉదయం నందికొట్కూరులో కొత్త కోర్టు ప్రారంభించి ఆ తర్వాత కర్నూలు జిల్లా కోర్టులో జిల్లాలోని న్యాయమూర్తుల వర్క్షాప్ తర్వాత సాయంత్రం కొత్త కోర్టులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గం సంయుక్తంగా నిర్వహించనున్నారు.


