గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆస్పరి: మండలంలోని శంకరబండ బస్టాప్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు.. మతిస్థిమితం సరిగా లేని, తెలుగులో మాట్లాడుతున్న ఈ వ్యక్తి శుక్రవారం సాయంత్రం ఆస్పరి సమీపంలో కనిపించాడు. ఆదోని వైపు నడిచివెళ్తుండగా గమనించారు. రాత్రి శంకరబండ బస్టాప్ సమీపంలో రోడ్డు వెంబడి వెళ్తున్న అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో పడిపోయడు. ఆదారి వెళ్లే వారు చూసి 108 వాహనంలో ఆదోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యలు సూచన మేరకు మైరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీగదిలో ఉంచినట్లు సీఐ తెలిపారు. మృతుడి శరీరంపై క్రీమ్ కలర్ పుల్ షర్టు, నీలం కలర్ లుంగి ధరించారన్నారు. శంకరబండ వీఆర్ఓ మాబుసుబానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
బొమ్మలసత్రం: నంద్యాల సమీపంలోని పొన్నాపురం రైల్వే ట్రాక్పై శనివారం ఓ బీటెక్ విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచర్ల పట్టణంలోని బైటి పేటకు చెందిన రామేశ్వర్ రెడ్డికి ఇద్దరు సంతానం. రామేశ్వర్ రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమారుడు విజయ్ కుమార్రెడ్డి (22) కర్నూలు నగర శివారులోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి దుపాడు రైల్వేస్టేషన్లో రైలు ఎక్కి నంద్యాలకు చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ సమీపంలో రైలు దిగి అక్కడే చాలా సేపు సంచరించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పొన్నాపురం సమీపంలో స్థానికులు రైల్వే ట్రాక్పై యువకుడు మృతదేహం పడి ఉన్నట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విజయ్కుమార్ రెడ్డి మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమా? ఆత్మహత్యా? మరేదైనా అనుమానాస్పద కారణాల వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు మృతుడి స్నేహితులను ప్రశ్నిస్తున్నారు.
అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీ య ఫీడే రేటింగ్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదరంగం మెదడుకు పదును పెట్టే క్రీడ అని అన్నారు. నంద్యాలలో అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులపై ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి పెంచరాదని, క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక వికాసం కలుగుతుందన్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. విజేతలకు రూ.3 లక్షల నగదుతో పాటు ట్రోఫీలు, పథకాలు, ప్రశంసా పత్రాలు ఆదివారం సాయంత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కళా శాల డైరెక్టర్ హేమంత్రెడ్డి, చీఫ్ ఆర్బిటర్ ఫణికుమార్, మణికంఠ, రాజారమేష్ చక్రవర్తి, సుజాత, కోచ్లు పాల్గొన్నారు.
కర్ణాటక వాసి మృతి
ఆదోని రూరల్: మండలంలోని 104 – బసాపురం సమీపంలో ఎల్లెల్సీ కాల్వ మరమ్మతు పనుల్లో ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి కర్ణాటక వాసి మృతి చెందాడు. ఇస్వీ ఎస్ మహేష్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఎల్లెల్సీ కాల్వ మరమ్మతులు పనులు చేసేందుకు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా పూలబావి గ్రామానికి చెందిన బసప్ప (38)తో పాటు మరి కొందరు వచ్చారు. కాల్వ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో బసప్ప, మరో ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు. బసప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. శనివారం ఉదయం మృతుడి కుటుంబీకులు అక్కడికి చేరుకుని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి సర్దిచెప్పి బసప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతుడికి భార్య రేణుకమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతి


