యామబ్బీ.. ఊరికేమాయా!
సంక్రాంతి పండుగకు ఎక్కడో ఉన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు స్వగ్రామానికి చేరుకున్నారు. చాలా మంది బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు పండుగకు పల్లెలకు చేరుకున్నారు. ఊరిలో స్నేహితులు, బంధువులు, పెద్దలు కలిసి కబురు చెప్పుకుంటూ కనిపించారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె గ్రామ రచ్చబండ వద్ద పలువురు ఆసక్తికర విషయాలు మాట్లాడుకుంటూ కనిపించారు. గత వైఎస్సార్సీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పాలనను బేరీజు వేస్తూ చర్చించారు. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుబడుతూ.. పడకేసిన అభివృద్ధి,
అందని సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని నిట్టూర్చారు. – కొలిమిగుండ్ల
భాస్కర్రెడ్డి: శివాడ్డి ఎక్కడికి పోయింటివి..ప్యాంటు వేసుకున్నావు..గని కాడికి పోలేదా?
శివారెడ్డి: తాడిపత్రికి పోయింటిని..పాలీష్ ప్యాక్టరీ ఓనర్ దగ్గరకు. సంక్రాంతి పండుక్కు లెక్క ఇస్తే కూలోల్లకు ఇద్దామనుకుంటిని..వ్యాపారాలు అప్పుడు మాదిరి లేవు..రాళ్లన్నీ ప్యాక్టరీలోనే ఆనుకున్నాయి.. అని కొంచెం ఇచ్చినాడు. కూలోల్లకు ఇచ్చేదానికి కూడ సరిపోదు. ఇంతకు ముందు గన్లలో రాళ్లు ఉండగానే ముందుగానే అడ్వాన్సు ఇచ్చి తీసుకుబోతుండిరి. ఇప్పుడు భంగకపోయి రాళ్లు ఎత్తిచ్చన్నాం. కూలోల్లకు పండక్కన్నా డబ్బులు ఇయ్యక పోతే మల్లా గనికి రారు. ఏట్లైనా వాల్లకు లెక్క ఇయ్యాల్సిందే. కొన్నాల్లుంటే రాల్లు అడిగే వారుండరేమో..
భాస్కర్రెడ్డి: భాగ్యాలూ.. మేకలు బాగున్నాయా..
భాగ్యాలు: బాగనే ఉన్నాయిన్నా..కానీ మన ఊర్లో పసుల ఆసుపత్రి ఉంది కానీ మందులే ఉండవు. డాక్టరు లేడు.. వేరు వాళ్లు ఎప్పుడో ఒక సారి వస్తాడంటా. నేనేం మేకలు తోలుకొని మేతకు కొండకు పోయింటాను. ఆసుపత్రి పడిపోయేలాగా ఉంది. ఇంతకు ముందు గవర్నమెంట్లో పశువులకు మందులు ఎన్ని కావాలన్నా ఇస్తండిరి. ఎదన్న రోగం వచ్చి మేకలు చచ్చిపోతే ఇన్సురెన్స్ కూడా రావడం లేదంటా.. పోయిన ప్రభుత్వంలో పశవులు చచ్చిపోతే ఆఫీసర్లు పోస్టుమార్టం చేసి పైకి పంపించగానే లెక్క పడుతుండేదంట.
భాస్కర్రెడ్డి: ఏం మద్దిలేటి.. యాడికి పోయింటివి లేటుగా వస్తివే!
మద్దిలేటి: ఒళ్లంతా నొప్పులుంటే ఖాశీం డాక్టర్ కాడికి పోయింటి..సూదేసి రెండు పూట్లకు మాత్రలు ఇచ్చినాడు. జగన్ ఉన్నప్పుడు నెల నెలా 104 బాగా వచ్చుండేది. ఇప్పుడు.. ఎప్పుడు వచ్చుందో తెల్దు. రెండు పూట్లకు మాత్రలు ఇచ్చినాడు. తగ్గక పోతే తాడిపత్రి కన్నా పోయి సూపించుకుంటా. పోయిన గవర్నమెంట్లో జగనన్న వైద్య శిబిరం మన ఊర్లో బడి కాడ పెట్టినప్పుడు పోయింటిని డాక్టర్లు మంచి మందులు ఇచ్చినారు. ఇప్పుడీ ప్రభుత్వం ఒక్క సారి కూడా వైద్య శిబిరం పెట్టనేలేదు.
భాస్కర్రెడ్డి: వెంకటనారాయణ నీకు 60 ఏళ్లు ఉండవు?
వెంకటనారాయణ: 60 ఏళ్లు పడి సంవత్సరం దాటిందిప్పా. సచివాలయం కాడికి ఆధార్ కార్డు తీసుకొని ఐదార్లు సార్లు పోయినా.. వాళ్లు ఇంకా పైనుంచి రాలేదంటున్నారు. జగన్ ఉన్నప్పుడు ప్రతి వాళ్లకు ఇచ్చినాడు. అప్లికేషన్ పెట్టేదే ఆలస్యం వెంబడే వచ్చండ్లా. ఇప్పుడు ఒక్కో ఊల్లో పించన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తన్నారు. కాళ్లు, చేతులు లేనళ్లకు ఇయ్యలా.
యామబ్బీ.. ఊరికేమాయా!


