వైభవంగా గోదాదేవి పరిణయం
● అహోబిలంలో శాస్త్రోక్తంగా ముగిసిన ధనుర్మాసోత్సవాలు
ఆళ్లగడ్డ: జయజయ నారసింహ నామ సంకీర్తనలు.. వేద పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. ఆస్థాన విద్వాంసుల మంగళకర వాయిద్యాల నడుమ శ్రీ అహోబిలేశుడు, గోదాదేవీ పరిణయ వేడుక బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో వైభవంగా జరిగింది. ఈ తంతుతో నెలరోజులు విశేష పూజలు నిర్వహిస్తూ గోదాదేవి అమ్మవారిని రోజుకో అలంకరణ చేస్తూ నిర్వహించిన ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా ముగిశాయి. బుధవారం వేకువ జామునే దిగువ అహోబిలంలో కొలువైన మూలవిరాట్ శాంతమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవర్లాతో పాటు గోదాదేవి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేలుకొలిపి ప్రత్యేక ధనుర్మాస, భోగి పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేసిన పెళ్లి మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను గోదాదేవి అమ్మవారికి ఎదురుగా కొలువుంచి వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశస్థాపణ, అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి కొలువుంచారు. రాత్రి స్వామి, అమ్మవారిని ఆండాళ్ అమ్మవారి సన్నిధికి తీసుకెళ్లి శ్రీ గోదాదేవి, ప్రహ్లాదవరదుల కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని, గోదాదేవిని పల్లకీల్లో కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు.
వైభవంగా గోదాదేవి పరిణయం
వైభవంగా గోదాదేవి పరిణయం


