
శ్రీమఠంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం రాత్రి మంత్రాలయం వచ్చారు. స్థానిక నరహరి తీర్థ అతిథి గృహంలో విడది చేసిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం శ్రీమఠం వచ్చారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు హారతులు పట్టి అర్చనలు చేశారు. ఎంపీ బస్తిపాడు నాగరాజు సైతం ఆయనతోపాటు దర్శనం చేసుకున్నారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావన దర్శనంతో మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రాయచూరు జిల్లా కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారి దర్శనం ముగించుకుని మధ్యాహ్నం మంత్రాలయం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆయనకు పుష్పగుచ్ఛాలతో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాత్రి శ్రీమఠంలో రథోత్సవాలను తిలకించారు. మంత్రి కుటుంబ సభ్యులకు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు శేషవస్త్రం, ఫలాలు, రాఘవేంద్రుల జ్ఞాపిక అందజేసి అక్షింతలతో ఆశీర్వదించారు. డీఎస్పీ ఉపేంద్ర బాబు నేతృత్వంలో బందోబస్తు చేపట్టారు. మఠం ఏఏవో మాధవశెట్టి ఆధ్వర్యంలో మంత్రికి మఠం మర్యాదలతో ఆహ్వానం పలికారు. ఆయనతోపాటు మఠం మేనేజర్ శ్రీనివాసరావు, సీఐ రామాంజులు, ఎస్ఐలు ఉన్నారు.