
రాజీనామా చేయాలని టీడీపీ వేధింపులు
కర్నూలు: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తనను రాజీనామా చేసి వెళ్లిపోవాలని టీడీపీకి చెందినవారు ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన ఆనంద్ ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో నేరుగా ఎస్పీ మాట్లాడారు. మొత్తం 93 ఫిర్యాదులు రాగా.. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
● హైదరాబాదులోని సాఫ్ట్వేర్ కంపెనీలో తన కుమారుడు జహీర్ బాషాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.2.50 లక్షలు తీసుకుని కర్నూలుకు చెందిన సీలం ధరణి మోసం చేసిందని కర్నూలు బి.క్యాంప్కు చెందిన ఆశా జహ ఫిర్యాదు చేశారు.
● మాధవరం గ్రామంలోని స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.50 లక్షలు తీసుకుని ఒక వ్యక్తి మోసం చేశాడని కోసిగి గ్రామానికి చెందిన పరుశురాముడు ఫిర్యాదు చేశారు.
● రూ.2 లక్షల విలువ గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా కర్నూలు బుధవారపేటకు చెందిన కృష్ణస్వామి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాసవి నగర్కు చెందిన వెంకటలక్ష్మి ఫిర్యాదు చేశారు.
● జొహరాపురం ఇందిరమ్మ ఇళ్లల్లో నా ఫ్లాట్ను ఆక్రమించుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని కర్నూలుకు చెందిన రంగారెడ్డి ఫిర్యాదు చేశారు.
● తాను కొనుగోలు చేసిన మూడు సెంట్ల స్థలంలో ఇంటిని నిర్మించుకోకుండా ధరణిపోగుల లవకుమార్ బంకు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మునగాల గ్రామానికి చెందిన ఆంజనేయులు ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన
ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్
పీజీఆర్ఎస్కు 93 ఫిర్యాదులు