
జనసేన, టీడీపీ వర్గీయుల ఘర్షణ
ఉయ్యాలవాడ: మండల కేంద్రమైన ఉయ్యాలవాడలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామ పెద్దల సమాచారం మేరకు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, సాగునీటి సంఘం చైర్మన్ ఆకుల చిన్న వెంకటసుబ్బయ్య ఈ నెల 5వ తేదీన మినరల్ వాటర్ ప్లాంటు ప్రారంభించారు. వాటర్ ప్లాంటుకు ఏర్పాటు చేసిన బోరులో నీరు సరిగా రాకపోవడంతో ప్లాంటుకు సమీపంలో వున్న చేతిబోరు నుంచి నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేపట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మండల బలిజ సంఘం గౌరవాధ్యక్షుడు, జనసేన నాయకులు జింకా వెంకటస్వామి అడ్డుకున్నారు. ఈ విషయంలో వారి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువురిని సర్దుబాటు చేశారు. స్థానికంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు లేకపోవడంతో దొర్నిపాడు ఎస్ఐ సత్యనారాయణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉయ్యాలవాడకు చేరుకుని విచారణ చేపట్టారు. 1999–2004 మధ్య నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సోదరుడు పోచా రాధాక్రిష్ణారెడ్డి సర్పంచ్గా కొనసాగిన సమయంలో భారతిసీడ్స్ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో 4 చేతి బోర్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే కమతం వీధిలో ఏర్పాటు చేసిన బోరును టీడీపీ నాయకుడు ఆక్రమించుకుని వాటర్ ప్లాంటుకు నీటి సరఫరాకు ప్రయత్నించడంతో వివాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా మండల వైఎస్సార్సీపీ, టీడీపీ కన్వీనర్లు బుడ్డా చంద్రమోహన్రెడ్డి, బోరెడ్డి రాజశేఖర్రెడ్డితో పాటు గ్రామపెద్దల సమక్షంలో రెండు నెలల పాటు చేతి బోరును వాటర్ ప్లాంటుకు వాడుకునేందుకు ఒప్పుకోవడం జరిగింది. ముందస్తుగా ఎలాంటి ఘర్షణలకు పాల్పడకుండా జనసేన, టీడీపీ నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
విద్యుత్ వైర్ల చోరీ
వెల్దుర్తి: పట్టణ సమీపంలోని ఊటమల్ల వంక వద్ద ఉన్న పొలాల్లో ఆదివారం రాత్రి వ్యవసాయ విద్యుత్ వైర్ల చోరీ జరిగింది. కుమ్మరి రంగస్వామి, బాలు, వడ్ల నాగేంద్రలు సోమవారం ఉదయం తమ పొలాలకు వెళ్లి చూడగా బోర్ల నుంచి స్టార్టర్కు ఉన్న విద్యుత్ వైర్లు లేకపోవడం గమనించారు. గుర్తు తెలియని దొంగలు రాత్రి సమయంలో కోసుకుని పోయి ఉంటారని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. వైర్ల చోరీ కారణంగా 15 ఎకరాల సాగుకు నీరందించే అవకాశం లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. గత నెలలో సైతం ఇదే విధంగా చోరీ జరిగిందని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిపారు.