
ఉపాధ్యాయ ఉద్యమ కెరటం అస్తమయం
కర్నూలు (సిటీ): విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా విద్యాబోధన చేసి ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించడంతోపాటు విద్యార్థులకు ప్రత్యేక పాఠశాల, వయోజనులకు రాత్రి పాఠశాలలు నిర్వహించిన ఉపాధ్యాయ ఉద్యమ కెరటం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తిరస్కరించిన వై.జమ్మన్న (85) సోమవారం హైదరాబాదులోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. వై.జమ్మన్న కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన విప్లవ నాయకుడు నీలం రామచంద్రయ్య మార్గదర్శకంలో కమ్యూనిస్టు భావజాలంతో విద్యనభ్యసించారు. హైస్కూల్ సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయుడిగా ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పారు. కోసిగి దొరల పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేశారు. ప్రతి నెలా తన జీతంలోంచి కొంత డబ్బులు పేద విద్యార్థులకు కేటాయించి ఫీజులు చెల్లించేవారు. జమ్మన్న కమ్యూనిస్టు పార్టీలో క్రీయాశీలకంగా ఉండటంతో 1982లో ఉపాధ్యాయ పోస్టు నుంచి సస్పెన్షన్కు గురిచేశారు. అయితే ఆయన కోర్టులో పోరాటం చేసి గెలుపొంది తిరిగి ఉద్యోగంలో చేరారు. కర్నూలులో ఏపీటీఎఫ్ భవనం ఏర్పాటుకు 50 శాతం సొంత నిధులను కేటాయించారు. 1998లో పదవీ విరమణ పొంది స్వగ్రామంలో నీలం రామచంద్రయ్య స్మారక ఉన్నత పాఠశాలకు పునాదులు వేశారు. పాఠశాల భవన నిర్మాణానికి రూ.2 లక్షలు సొంత నిధులు కేటాయించి పూర్తి చేయించారు. ఈయన మృతి పట్ల ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు సంతాపం తెలిపారు.