
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
వృద్ధురాలి నేత్రాలు దానం
బేతంచెర్ల: పట్టణానికి చెందిన లక్ష్మీదేవి అనే వృద్ధురాలు (75) అనారోగ్యంతో మృతి చెందగా ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. వృద్ధురాలి కుమారుడు వీరేష్, మనవడు లింగేష్ వెంటనే లైఫ్ యువనేత్ర సేవా సమితికి విషయం చెప్పడంతో వారు కర్నూలు ఐ బ్యాంకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి టెక్నిషియన్ శ్రీకాంత్ వృద్ధురాలి నేత్రాలను సేకరించి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా తీసుకున్నారు.
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
బేతంచెర్ల: ఫిట్స్తో ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ పుల్లారెడ్డి (58) మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఆదివారం ఆర్ బుక్కాపురం గ్రామ సమీపాన చోటు చేసుకుంది. కొమ్మూరు కొట్టాల గ్రామానికి చెందిన పుల్లారెడ్డి ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. మండలంలోని ఆర్ బుక్కాపురం గ్రామం వద్ద జరుగుతున్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ట్రాక్టర్ తీసుకెళ్లాడు. పనులను ముగించుకొని ట్రాక్టర్ తోలుతుండగా ఇంటికి బయలు దేరాడు. ఫిట్స్ రావడంతో ట్రాక్టర్ కింద పడి టైర్ ఎక్కడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
20 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
ఆదోని సెంట్రల్: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ఆదోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్.సుధాకర్రెడ్డి ఆదివారం విలేకరులకు తెలిపారు. పాలిసెట్ 2025 ఎగ్జామ్లో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్కు సంబంధించిన ఫీజును ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో చెల్లించాలన్నారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు పాలిసెట్ ర్యాంకు ప్రకారం ఆదోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు.వివరాలకు 9885251182, 8121555646 నంబర్లను సంప్రదించాలన్నారు.
నేడు ఆత్మకూరులో జాబ్మేళా
ఆత్మకూరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సోమవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.జి. శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాకు 10 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారని, పది ఆ పై విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7673902328, 9154830286 నంబర్లను సంప్రదించాలన్నారు.

అమ్మవారికి పల్లకీ సేవ