ఆరోగ్యమే మహాభాగ్యం!
కర్నూలు(హాస్పిటల్): ఆస్తులు, అంతస్తులు లేకపోయినా ఫర్వాలేదు...మంచి ఆరోగ్యముంటే చాలనే మాట ఇటీవల చాలా మందిలో వినిపిస్తోంది. ఎందుకంటే సమాజంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక జబ్బుతో ప్రస్తుతం బాధపడుతున్నారు. దీంతో వారి విలువైన జీవితాన్ని, కాలాన్ని కోల్పోతున్నారు. ఆనందమయంగా జీవించలేకపోతున్నారు. అందుకే నేడు చాలా మంది ఆరోగ్యమే మహాభాగ్యం అనే ధోరణితో బతుకుతున్నారు. అనేక ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినంగా నిర్వహిస్తున్నారు. ఎన్సీడీ 2.ఓలో భాగంగా అసంక్రమిత వ్యాధులపై జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వారు ఇందులో 19,12,227 మంది ఉన్నారు. ఇందులో 5,50,034 మందికి పరీక్ష చేయగా 29.40 శాతం మందికి బీపీ, 17.85 శాతం మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు 1,817 మందికి నోటి క్యాన్సర్, 1,063 మందికి రొమ్ము క్యాన్సర్, 862 మందికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. 45,040 మంది గర్భిణులు రిజిస్టర్ కాగా అందులో 10,072 మంది గర్భిణులు హైరిస్క్లో ఉన్నట్లు తేల్చారు. అలాగే జిల్లాలో ప్రస్తుతం 3,077 మందికి టీబీ, 395 మందికి కొత్తగా కుష్టు వ్యాధి ఉండగా, ఏఆర్టీ కేంద్రాల్లో నమోదైన 18,843 మందిలో 7,485 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. దోమల కారణంగా వచ్చే వ్యాధులైన డెంగీతో 400 మంది గత సంవత్సరం బాధపడ్డారు. పై వ్యాధులన్నీ అధిక శాతం జీవనశైలి కారణంగా వచ్చినవే. కొన్ని వంశపారంపర్యంగా, ఇంకొన్ని సీజనల్ వ్యాధులు, పోషకాహారలోపం కారణంగా వస్తున్న వ్యాధులు. వీటన్నింటినీ అధిగమించాలంటే సరైన జీవనవిధానం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
● మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామ మూ అంతే ముఖ్యం. వారానికి కనీసం 150 నిమిషా లు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
● రోగనిరోధక వ్యవస్థ చక్కగా ఉండాలన్నా, మానసిక ప్రశాంతంగాకు నాణ్యమైన నిద్ర ఉండాలి.
● ధూమ, మద్యపానంతో ఊపరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ, గుండె, కాలేయ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ దురలవాట్లకు దూరంగా ఉంటే మంచిది.
● శరీరంతో పాటు ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముందస్తుగా కొన్ని రకాల హెల్త్ చెకప్లు అప్పుడప్పుడూ చేయించుకోవాలి.
● ఒంటరితనం అనారోగ్యానికి బాటలు వేస్తుంది. సామాజిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. పది మందిని కలుస్తూ స్నేహ జీవితాన్ని కొనసాగించాలి.
సమతుల ఆహారం తినాలి
ప్రతి ఒక్కరూ నిత్యం సమతుల ఆహారం తీసుకోవాలి. తినే ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కోడిగుడ్లు, చికెన్ వంటికి తినాలి. దీంతో పాటు ప్రతి రోజూ 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తాగేలా చూసుకోవాలి.
–డాక్టర్ రవికళాధర్రెడ్డి,
జనరల్ ఫిజీషియన్, కర్నూలు
మానసిక ఒత్తిడి
తగ్గించుకోవాలి
ఆధునిక సమాజంలో ఒత్తిడి తో కూడిన జీవితం ప్రతి ఒక్కరికీ ఎక్కువవుతోంది. దీర్ఘకాలంగా ఉండే ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఊబకాయం, గుండెజబ్బులు, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, ప్రాణా యామాలు, యోగా, పచ్చని ప్రకృతిలో గడపడం వంటివి చేయాలి. –డాక్టర్ బీఎస్. ప్రవీణ్కుమార్,
కార్డియాలజిస్టు, కర్నూలు
ఆరోగ్యంపై ప్రజల్లో పెరిగిన శ్రద్ధ
ఆహారపు అలవాట్లలో మార్పు
వ్యాయామానికి ప్రాధాన్యం
నేడు ప్రపంచ ఆరోగ్య దినం
ఆరోగ్యమే మహాభాగ్యం!
ఆరోగ్యమే మహాభాగ్యం!


