
బీచ్లో గల్లంతై ఆటోడ్రైవర్ మృతి
కోనేరుసెంటర్: మంగినపూడిబీచ్లో గల్లంతై ఓ ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటనపై బందరు రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుడ్లవల్లేరు మండలం పేజేండ్ర గ్రామానికి చెందిన షేక్ జిలాని (30) ఆటో నడుపుతుంటాడు. బుధవారం గుడ్లవల్లేరు నుంచి జిలానీ కుటుంబంతో పాటు ఇతర బంధువులు అంతా కలిసి విహారయాత్రకు మంగినపూడి బీచ్కు వెళ్లారు. అందరూ అలల మధ్య స్నానాలు చేస్తుండగా జిలాని ఒక్కసారిగా అలల మధ్య చిక్కుకుని కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు, బంధువులు బిగ్గరగా కేకలు వేయడంతో బీచ్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. మరుకొద్ది సేపటికి జిలాని శవమై ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ నాగరాజు సంఘటనాస్థలానికి చేరుకుని బంధువుల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.