
నీటిపై ఆసనం.. ఆరోగ్యదాయకం
నాగాయలంక: యోగాంధ్ర మాసోత్సవాలను పురస్కరించుకొని స్థానిక శ్రీపాద క్షేత్రం వద్ద కృష్ణానదిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన జలయోగా విజయవంతంగా ముగిసింది. తొలుత కలెక్టర్ డీకే బాలాజీ కృష్ణవేణి విగ్రహానికి, శ్రీరామలింగేశ్వరస్వామికి పూజలు చేసి, గాలిలోకి బెలూన్లు వదిలి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దివిసీమ, ప్రధానంగా నాగాయలంక ప్రాంతాన్ని పర్యాటక, జలక్రీడల అభ్యున్నతితో దేశంలోనే ప్రత్యేకంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈవెంట్లో విజయవాడ తదితర పాంతాల నుంచి ఈతలో నిష్ణాతులైన 150మందికి పైగా ఈ జలయోగాలో ప్రాతినిధ్యం వహించారు. విజయవాడలోని అమరావతి వాకర్స్, ఈత మిత్రులు, ఫిషరీస్ పాలిటెక్నిక్ విద్యార్థులు పర్యవేక్షణలో నదిలో యోగా కొనసాగింది. రెవెన్యూ, ఆయుష్ విభాగం, మత్స్యశాఖ, పోలీసులు, పంచాయతీ వర్గాలు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు..
నదిలో జరిగిన యోగాలో చంద్ర నమస్కారాలు, శవాసనాలు, పద్మాసనాలు, ప్లవర్ ఆకృతిలో ఆసనాలను అభ్యాసకులు అద్భుతంగా ప్రదర్శించారు. 50ఏళ్లు పైబడిన కడవకొల్లు లలిత, దివ్యాంగుడు తలశిల రాము, ఏడేళ్ల బాలిక నిత్యశ్రీ ప్రియ ప్రదర్శించిన ఆసనాలు వీక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఎస్పీ ఆర్.గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆసనాలను ఆద్యంతం తిలకించారు. అనంతరం నాగాయలంక జలయోగా ప్రదర్శన తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు అయినట్లు ఆ సంస్థ నిర్వాహకుడు సీహెచ్ వెంకటాచారి ప్రకటించారు. అందుకు సంబంచి మెమెంటో, పత్రాలను కలెక్టర్ బాలాజీ, జేసీ గీతాంజలిశర్మకు అందజేశారు.
నాగాయలంకలో ఉత్సాహంగా జల యోగా ప్రారంభించిన కృష్ణా కలెక్టర్ బాలాజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు

నీటిపై ఆసనం.. ఆరోగ్యదాయకం