
వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మేలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు పొలం పనులకు రావటం చాలా కష్టంగా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా ట్రాక్టర్తో నడిచే యంత్ర పరికరాలు, రోటోవేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, ట్రాక్టర్ భూమ్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, బ్రష్ కట్టర్లు, పవర్ టెల్లర్స్ వంటి యంత్ర పరికరాలను 50 శాతం రాయితీతో అందజేస్తోందన్నారు. ముందస్తు రాయితీపై పనిముట్లను ఆగ్రో సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. తన పొలంలో పని పూర్తయిన తరువాత ఇతర రైతులకు కూడా అద్దెకు ఇచ్చుకోవచ్చన్నారు. తొలుత వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 121 మంది రైతులకు రూ. 4.10 కోట్ల విలువ చేసే యంత్ర పరికరాలకు సంబంధించి రూ. 1.90 కోట్ల రాయితీ చెక్కును రైతులకు అందజేశారు. జిల్లా వ్యవసాయాధికారి మనోహరరావు, ఏడీ మణిధర్, ఏవోలు పలువురు రైతులు పాల్గొన్నారు.
డ్రోన్లను వినియోగించండి..
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి మోపిదేవి మండలానికి చెందిన రైతు గ్రూపునకు రూ.10లక్షలు విలువ చేసే డ్రోన్లను 80 శాతం సబ్సిడీతో అందజేశారు. రసాయనాలు వెదజల్లాలంటే ఎకరానికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందని డ్రోన్ల ద్వారా కేవలం రూ. 200 మాత్రమే ఖర్చవుతుందన్నారు. జిల్లాలో 32 రైతు సంఘాలకు డ్రోన్లు మంజూరు చేశామని 15 సంఘాలు మాత్రమే ముందుకు వచ్చాయన్నారు.