
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
‘తల్లికి వందనం’ నగదు విషయంలో భార్యభర్తల మధ్య గొడవ
కోనేరుసెంటర్: బందరు మండలం పెదపట్నం గ్రామానికి సమీపంలో బుధవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముదినేపల్లికి చెందిన సీహెచ్ గణేష్ (34) కూలి పనులు చేస్తుంటాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఇద్దరు పిల్లలకు నగదు జమ చేసింది. అయితే పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి వచ్చిన డబ్బును ఇంట్లో అవసరాలకు వినియోగిద్దామని గణేష్ చెప్పగా అందుకు భార్య అంగీకరించలేదు. తన పిల్లలను ప్రైవేటు స్కూలులోనే చేర్పించి చదివిద్దామని చెప్పటంతో ఇరువురి మధ్య వివాదం రేగింది. వీరి వివాదం తారస్థాయికి చేరటంతో గణేష్ బుధవారం బైక్పై పెదపట్నంకు సమీపంలోని బీచ్కు వచ్చి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం ఏం జరిగిందో తెలియదు గానీ గణేష్ బీచ్కు సమీపంలో ఉన్న పైపులను గుద్దుకుని పడిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఒంటిపై గాయాలు లేవు..
అయితే గణేష్ పైపులను గుద్దుకున్న కారణంగా చనిపోయనట్లయితే బలమైన గాయాలు ఉండాలి కానీ ఒంటిపై ఎటువంటి గాయాలు లేకపోవటంతో మృతుడు ప్రాణాలు తీసుకునేందుకు ఏదైనా పురుగుల మందు సేవించి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు ఆయన చెప్పారు.