ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లాకు చెందిన భక్తులు రూ.లక్ష విరాళం సమర్పించారు. కంకిపాడుకు చెందిన పి.శ్రీనివాసరావు, సత్యవతి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేసింది. ఆలయ అధికారులకు దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
తిరుపతమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం
పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయానికి శనివారం కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, గండికుంట గ్రామానికి చెందిన కగ్గా సాంబయ్య దంపతులు రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ నగదును ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావు చేతుల మీదుగా ఆందజేశారు. విరాళంలో రూ.50 వేలు నిత్యాన్నదాన పథకానికి, రూ.50 వేలు అంకమ్మవారి ఉపాలయం గోపురం వెండి తాపడానికి వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.
పాకిస్తానీయులు తక్షణం దేశం విడిచి వెళ్లాలి
కోనేరుసెంటర్: జిల్లాలో పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈనెల 27వ తేదీలోపు భారత్ను విడిచి వెళ్లిపోవాలని కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. లేనిపక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్కు చెందిన వ్యక్తులు వెంటనే తమ సమాచారం సంబంధిత పోలీస్స్టేషన్లకు తెలియజేసి, దేశం విడిచి వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో చట్టాల ఉల్లంఘన ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాజ శాంతి, భద్రత కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో లోపాలు ఉన్నాయని, వాటిని తక్షణమే కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను డీఎస్సీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇంటర్, డిగ్రీ, పీజీలో మార్కుల శాతంతో సంబంధం లేకుండా డీఎస్సీకి అనుమతి ఇవ్వాలని కోరారు. బీఈడీ, డైట్ చేసి టెట్ అర్హత సాధించిన వారు ఇప్పుడు ఎందుకు అనర్హులు అయ్యారో చెప్పాలని తెలిపారు.
డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మాట్లాడుతూ సిలబస్ విస్తృతి రీత్యా అభ్యర్థులకు ప్రిపరేషన్కు 90 రోజులు సమయం ఇవ్వాలని చెప్పారు. డీఎస్సీ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఏపీపీపీఎస్సీ పరీక్షలు, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని డీఎస్సీ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.అనేక మందికి ఎడిట్ ఆప్షన్, సబ్జెక్టు చూపించడం లేదన్నారు. తక్షణమే పై సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం