
మామిడి రైతుకూ నష్టాలే
పెనుగంచిప్రోలు: ఈ ఏడాది మామిడి రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కోలుకోలేని నష్టం వాటిల్లింది. సాధారణంగా మే నెలలో చెడుగాలులు, వానలు వస్తాయి. ఈసారి ఏప్రిల్ మొదటి వారం నుంచే అకాల వర్షంతోపాటు గాలి దుమ్ములు రావడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన తరుణంలో అకాల వర్షం, గాలులకు మామిడి కాయలు నేల రాలాయి. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో గాలివాన రావడంతో 40 నుంచి 60 శాతానికి పైగా కాయలు రాలిపోయాయి. గాలిదుమ్ము రాక ముందు మామిడి టన్ను రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు పలుకగా ప్రస్తుతం టన్ను ధర రూ.30వేల నుంచి రూ.40వేలకు పడిపోయింది. కాయ నాణ్యత ఆధారంగా ధర మారుతోంది.
కౌలురైతులకు మరింత నష్టం...
ఎకరాకి రూ.20వేలు నుంచి రూ.30వేలు కౌలు చెల్లించి మామిడి తోటలను సాగుచేస్తున్న వారికి ఈ ఏడాది మరింత నష్టం వాటిల్లింది. తెగుళ్లతోపాటు గాలులకు కాయలు రాలడంతో కోలుకోలేని దెబ్బతిన్నారు. ఎకరానికి రూ.20వేలు నుంచి రూ. 25వేల వరకు నష్టాలు తప్పేలా లేవని కౌలురైతులు వాపోతున్నారు. జిల్లాలో మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో గాలులు మామిడికాయలు భారీగా నేలరాలడంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఉద్యానవనశాఖ అధికారులు చెబుతుండగా, నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మామిడిచెట్లకు తొలుత తెగుళ్లు..
ఇటీవల గాలి దుమారం..
అకాల వర్షాలు
కోత సమయాన నేలరాలిన కాయలు
తీవ్రనష్టాల్లో మామిడిసాగు రైతులు