
అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి
● అధికారులకు కలెక్టర్ బాలాజీ ఆదేశం ● మీకోసంలో 201 అర్జీలు స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీల విషయంలో అత్యంత శ్రద్ధ వహించి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, పౌరసరఫరాల సంస్థ డీఎం పద్మాదేవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పోషణ్ అభియాన్ ఏడో పౌష్టికాహార పక్షోత్సవం జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. గర్భస్థ దశ నుంచి రెండు సంవత్సరాల వరకు పౌష్టికాహారం అందజేసేందుకు లక్ష్యంగా ఈ పక్షోత్సవాలు నిర్వహించాలన్నారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మీకోసంలో 201 అర్జీలను స్వీకరించారు.
ప్రధానంగా వచ్చిన అర్జీలు ఇవే...
● పమిడిముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు సీహెచ్ రాజ్సురేష్ లంకపల్లి గ్రామంలో గత 60 సంవత్సరాలుగా తన స్వాధీనంలోనే ఉన్న సర్వే నంబర్ 188/5 లో ఉన్న 60 సెంట్ల భూమిని తన వదిన పది మందితో కలిసి వచ్చి ఆక్రమించుకున్నారని, తనకు పోలీస్ రక్షణ కల్పించి తన భూమిని కాపాడాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
● కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు కొప్పనాతి అనూహ్య తన తల్లి విజయ సాయంతో మీకోసం కార్యక్రమానికి వచ్చారు. తనకు ప్రస్తుతం రూ.6 వేలు పింఛను వస్తోందని, పూర్తిగా మంచానికే పరిమితమైన తనకు రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా చికిత్స చేయించమని వైద్యాధికారులను ఆదేశించారు.
● ముదినేపల్లి మండలం వైవాక గ్రామానికి చెందిన ఎం.వీర వెంకట సుబ్రహ్మణ్యం ఉయ్యూరు మండలం కలువపాములలోని జ్యోతి పాలిటెక్నిక్లో తన కుమార్తె చేర్పించానని, అయితే ప్రభుత్వం వారు అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇచ్చే ఫీజు జమ కాలేదన్నారు. రోజు కూలీ చేసుకుని జీవనం సాగించే తాను కుమార్తె ఫీజు విషయంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.

అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి