
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
పెడన: ఈ నెల 18న ఆత్మహత్యకు యత్నించి, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటనపై ఆదివారం పెడన పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని కొంకేపూడి గ్రామానికి చెందిన రాజులపాటి శ్రీను(40) మద్యానికి బానిసయ్యాడు. భార్య రుక్మిణితో గొడవ పడి మద్యానికి డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. బంధువులు గమనించి తలుపులు పగలగొట్టి శ్రీనును హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. భార్య రుక్మిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పట్టాలు తప్పిన సర్వీసు రైలు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో మరమ్మతుల నిమిత్తం వచ్చిన సర్వీసు రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. దీంతో గేటు వద్ద భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.