వాంకిడి: విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. వాంకిడి మండలం బెండార గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. వంటశాల, మూత్రశాలలు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షల తీరుపై ఆరా తీశారు. కొందరు విద్యార్థులు గైర్హాజరు కావడాన్ని గమనించి ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గైర్హాజరవుతున్న వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈవీఎంల గోదాం పరిశీలన
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) భద్రపరిచే గోదాంను నెలవారీ తనిఖీల్లో గురువారం కలెక్టర్ హరిత పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం అధికారులు జమీల్, శ్యాంలాల్, ముసాఫిర్ హుస్సేన్ తదితరులు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని ఉద్యానవనాన్ని పరిశీలించారు.


