ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చి 330 పడకల స్థాయికి అప్గ్రేడ్ చేశామని, జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి సూపరింటెండెంట్ ప్రవీణ్కుమార్, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ సుబోధ్కుమార్తో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సిబ్బంది నియామకం, వైద్య పరికరాలు సమకూర్చి సేవల్లో నాణ్యత పెంచుతామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చే నిధులను అత్యవసర మందులు, ఆక్సిజన్, ఇతర పరికరాల కొనుగోలుకు వినియోగించాలని, ఇతర అవసరాలకు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని పార్కింగ్కు కేటాయించాలన్నారు. మార్చురీ వ్యాన్, అంబులెన్స్ కోసం, ప్రత్యేక వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నందున అవసరమైన ఆపరేషన్ థియేటర్, పరికరాలు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి నివేదించేందుకు కమిటీ సభ్యులు ఆమోదించినట్లు వెల్లడించారు. సమావేశంలో వైద్యులు, కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
బెజ్జూర్ ఆస్పత్రి తనిఖీ
కౌటాల: బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ కె.హరిత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు రికార్డులతోపాటు వార్డులు, పరిసరాలు పరిశీలించారు. కలెక్టర్ మా ట్లాడుతూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి సే వలు అందించాలన్నారు. సాధారణ ప్రసవాలు పెంచాలని, గర్భిణులు ప్రభుత్వ వైద్యంపై అవగాహన కల్పించాలని, వడదెబ్బపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాల, తహసీల్దార్ కార్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


