ఆసిఫాబాద్: మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం మహిళాశిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన బేటా జన్మోత్సవ్ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల్ల మంగ, జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్, డీఎంహెచ్వో సీతారాం, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ బేటీ బచావో– బేటీ పడావో కార్యక్రమం ద్వారా ఆడ పిల్లలను ‘కాపాడుకుందాం, చదివించుకుందాం, ఎదగనిద్దాం’ నినాదంలో పని చేస్తున్నామన్నారు ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా ఆర్థిక చేయూతనందించి వ్యాపార రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల కు వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తామన్నారు. అనంతరం పిల్లలకు కావాల్సిన 12 రకాల వస్తువులతో కూడిన 10 బేబీ కిట్లను అందజేశారు. అంగన్వాడీ టీచర్లకు విధుల కోసం 871 4జీ మొబైళ్లను పంపిణీ చేశారు.


