ఊపిరి పోసిన వాన
వర్షం కాపాడింది...
ఏపుగా
పెరిగిన
పత్తి మొక్క
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో జల్లులు కురుస్తున్న నేపథ్యాన రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి అడపాదడపా జల్లులు కురుస్తుండగా.. రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు పొలంబాట పట్టారు. ఇన్నాళ్లు వాతావరణం అనుకూలించక, వర్షాలు అంతంతమాత్రంగానే ఉండడంతో సాగు పనులు ఆశించిన స్థాయిలో సాగలేదు. అక్కడక్కడా మెట్ట పంటల సాగును మాత్రం రైతులు ప్రారంభించారు.
భయపెడుతున్న ఎల్నినో
పంటల సాగుపై ఎల్నినో మేఘాలు కమ్ముకున్నాయి. మృగశిర కార్తెలో వర్షాలు కురవగానే రైతులు సాగు ప్రారంభిస్తారు. అయితే ఈసారి జూన్ ముగింపు దశకు చేరినా ఆశించిన వర్షం కురవలేదు. దీంతో రైతులు పొడి దుక్కులు దున్ని వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొందరు పత్తి విత్తనాలు నాటడంతో పాటు మిర్చి నారు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, ఉక్కపోత ప్రభావానికి చాలాచోట్ల విత్తనాలు మొలకెత్తక మరోసారి కూడా నాటారు. అయితే, వాతావరణ శాఖ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని చెబుతుండడంతో సాగుపై రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు.
చిరు జల్లులకే పరిమితం
వారం, పది రోజుల నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. పంటల సాగుకు అనుకూలమైన వర్షాలు లేక రైతులు వేచి చూస్తున్నారు. కొద్దిరోజులుగా మధ్యాహ్నం వరకు ఎండ కొనసాగుతూ, సాయంత్రం మబ్బు పట్టి కొద్దిపాటి వర్షం కురుస్తోంది. ఫలితంగా భూమి చల్లబడకపోవడంతో పూర్తిస్థాయిలో దుక్కులు దున్నేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు.
92 వేల ఎకరాల్లో పంటలు
వ్యవసాయ శాఖ ఈ ఏడాది వర్షాకాలంలో అన్నీ కలిపి 5,67,154 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యం మేర పంటలు సాగవుతాయా, లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు 92,451 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. వరి 3,05,366 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. ప్రస్తుతం 3,766 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో సాగుచేయగా, 395 ఎకరాల్లో నాట్లు వేశారు. ఇంకో 13,718 ఎకరాలకు సరిపడా నారుమడులు పెంచుతున్నారు. ఇక పత్తి 2,36,908 ఎకరాలకు గాను 83,547 ఎకరాల్లో విత్తనాలు నాటారు. పెసలు 3,837 ఎకరాల్లో వేశారు. వర్షాలు నిలకడగా కొనసాగి, జూలైలో సమృద్ధిగా కురిస్తే వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటల సాగు అమాంతం పెరిగే అవకాశముంది.
జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు వర్షం
కురిసింది. తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 3 సెం.మీ., కాకరవాయిలో 2.8, ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో 2, కలెక్టరేట్ వద్ద ఒక సెం.మీ. వర్షపాతం
నమోదైంది. మిగిలిన మండలాల్లోనూ వర్షం కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అంతేకాక రానున్న నాలుగైదు రోజులు
వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ
ప్రకటించడం, జూలై నెలలో వర్షాలు
కొనసాగితే పంటల సాగుకు డోకా ఉండదని భావిస్తున్నారు..
ఐదెకరాల్లో పొడి దుక్కిలోనే పత్తి విత్తనాలు పెట్టా. ఇటీవల అడపాదడపా కురిసిన వర్షాలకు కొంత మొలకెత్తింది. కానీ పది రోజులుగా తీవ్రమైన ఎండలతో మొక్కలు నిలబడవని భయమేసింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం పంటను ఆదుకుంది. వానలు పడతాయనే నమ్మకంతో రూ.వేలు వెచ్చించి పత్తి విత్తనాలు కొని నాటా. మరో రెండు, మూడు వానలు పడితే కొంత వరకు పత్తి నిలబడుతుంది. – షేక్ మౌలానా, కొణిజర్ల


