● ‘సీతారామ’ పూర్తిచేస్తేనే నదీజలాలపై హక్కులు ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
భద్రాచలం: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాటలు విని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలపై హక్కులు కోల్పోయేలా చేస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఇదే జరిగితే రేవంత్రెడ్డిని భవిష్యత్ తరాలు క్షమించబోవని తెలిపారు. భద్రాచలంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ హయాంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలని కోరారు. నదీజలాలపై హక్కులు సాధించాలంటే గిరిజన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పూర్తిపై దృష్టి సారించాలన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం, చుట్టుపక్కల గ్రామాలు జలమయం అవుతాయని, అయినా సీఎం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్, తాతా మధు మాట్లాడుతూ సొసైటీల పేరుతో కాంగ్రెస్ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతూ గిరిజనులను మోసం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ఇసుక వాహనాలతో రహదారులను నాశనం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరి ఓట్లను కాపాడాల్సిన బాధ్యత పార్టీ బీఎల్ఏలపై ఉందని సూచించారు. నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, గొడవర్తి నరసింహమూర్తి, బోదెబోయిన బుచ్చయ్య, మాజీ ఎంపీపీ రేసు లక్ష్మి, గంప రాంబాబు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


