పెనుబల్లి/ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగా సుబ్బారావు (90) శనివారం మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెనుబల్లి మండలం వీఎం.బంజరలోని స్వగృహంలో కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా జలగం వెంగళరావు ఉన్న సమయాన ఇల్లెందు ఎమ్మెల్యే(1972–78)గా కాంగ్రెస్ తరఫున సుబ్బారావు గెలిచారు. ఆ సమయంలో ఆయన సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావుపై 11,826 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతేకాక పలు కార్పొరేషన్లకు చైర్మన్గా కూడా పనిచేశారు. అలాగే, గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) వ్యవస్థాపకుడైన సుబ్బారావు గౌడ కులస్తులను ఒక తాటిపైకి తీసుకురావడంలో కృషి చేశారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు సుబ్బారావు మృతదేహం వద్ద నివాళులర్పించగా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఫోన్లో కుటుంబీకులను పరామర్శించారు. అంతేకాక సుబ్బారావు మృతిపై సత్తుపల్లి, ఇల్లెందు ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, బానోతు హరిప్రియ, కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ తదితరులు సంతాపం తెలిపారు. కాగా, ఆదివారం వీ.ఎం.బంజరలో సుబ్బారావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


