నేలకొండపల్లి: అనుమతి లేకుండా చెరువుల నుంచి మట్టి తరలిస్తే సహించేది లేదని జలవనరుల శాఖ సీఈ మంగళపూడి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మండలంలోని కట్టుకాచారంలో చెక్డ్యామ్ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. చెరువుల మట్టి వాణిజ్య అవసరాల కోసం కావాల్సిన వారు తగిన రుసుం చెల్లించి అనుమతి తీసుకోవాలన్నారు. రైతులు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉన్నా అనుమతి మాత్రం తప్పనిసరన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో నీటి మట్టం పెరిగేలా పూడికతీతకు నిర్ణయించామని తెలిపారు. కాగా, రూ.15కోట్లతో కట్టుకాచారాం, సదాశివాపురం, పైనంపల్లి, ఊటవాగుతండాలో చెక్డ్యామ్ నిర్మాణాలు జరుగుతుండగా, ప్రతీ చెక్డ్యామ్ పరిధిలో కనీసం 2వేల ఎకరాల మేర ఆయకట్టు పెరుగుతుందన్నారు. జక్కేపల్లి, జాన్పాడ్తండా చెక్డ్యామ్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే, జలవనరుల శాఖలో ఖాళీ పోస్టులను ఆగస్టు నాటికి భర్తీ చేసేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈఈ పొట్టయ్య, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జల వనరుల శాఖ సీఈ వెంకటేశ్వర్లు


