● అవసరమైన చోటుకు తీసుకెళ్లేలా ట్రాలీలో ఏర్పాటు ● బ్రేక్డౌన్ ప్రాంతాలు, ప్రభుత్వ సభలకు వినియోగం
ఖమ్మంవ్యవసాయం: ఎక్కడైనా సబ్ స్టేషన్లో విద్యుత్ అంతరాయం ఏర్పడితే మరో సబ్స్టేషన్ నుంచి తాత్కాలికంగా సరఫరా చేస్తారు. అదే ట్రాన్స్ఫార్మర్ పాడైతే కొత్తది తీసుకొచ్చి అమర్చే వరకూ ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు. ఇలాంటి సందర్భాలతో పాటు వీఐపీల సభలు, ప్రభుత్వ కార్యక్రమాల వద్ద వినియోగించేలా ఎమర్జెన్సీ మొబైల్ ట్రాన్స్ఫార్మర్ ట్రాలీని ఖమ్మం విద్యుత్ సర్కిల్ అధికారులు రూపొందించారు. ఓ ట్రాలీపై 160 కేవీఏ సామర్ధ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ను అమర్చగా, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినప్పుడు వెంటనే దీన్ని తీసుకెళ్లి తాత్కాలికంగా సరఫరా పునరుద్ధరిస్తారు. అంతేకాక వీఐపీల సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ ట్రాన్స్ఫార్మర్ ట్రాలీని అందుబాటులో ఉంచడం ద్వారా సరఫరా సాఫీగా సాగుతుంది. అలాగే, వేసవిలో లోడ్ పెరిగిన ట్రాన్స్ఫార్మర్ల వద్ద దీన్ని లోడ్ రిలీఫ్ కోసం వినియోగిస్తారు. ఈ మొబైల్ ట్రాన్స్ఫార్మర్ను ఖమ్మంలో ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గురువారం ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఖమ్మం టౌన్ డీఈ(ఆపరేషన్స్) నంబూరి రామారావు, ఏడీఈలు సీహెచ్.నాగార్జున, సంజీవ్కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.


