ఈనెల 15వరకు ‘ఽభూభారతి’లో
నమోదైన వారికి అమలు
ఖమ్మంవ్యవసాయం: అన్నదాతల పంటల సాగుకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు భరోసా’ పథకం అమలుకు మార్గదర్శకాలను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. ఎకరాకు రూ.6వేల చొప్పున రెండు సీజన్లలో కలిపి రూ.12 వేలను రైతుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. ప్రస్తుత వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయా న్ని ఈనెల 30న చింతకానిలో జరిగే సభలో సీఎం రేవంత్రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు విధివిధానాలు వెల్లడయ్యాయి.
వివరాలు సమర్పించండి
ప్రస్తుత వానాకాలం రైతు భరోసా పథకం అందాలంటే ఈనెల 15 నాటికి భూభారతి పోర్టల్లో భూమి వివరాలు నమోదై ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నుంచి అనుమతులు జారీ అయి ఉండాలి. అలాగే, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగిన వారు కూడా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ నుంచి అనుమతులు పొంది ఉండాలి. ఆయా శాఖలు అర్హుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆపై ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున ఖాతాలో జమ చేస్తుంది. ఈమేరకు అర్హులైన రైతుల రికార్డులను ఈనెల 30వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం జిల్లా వ్యవసాయాధికారులకు ఆదేశించింది. జిల్లాలో మొత్తం 3.58 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా నమోదయ్యే అవకాశముందని, వీరికి ప్రస్తుత సీజన్లో రూ.460 కోట్ల మేర నిధులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ జాబితాలోనే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన 3,906 మంది ఉన్నారు.


