జూన్ 2వ తేదీ నుంచి
‘ఇందిరమ్మ బీమా భరోసా’ అమలు
పాఠశాలల్లో అల్పాహారం,
కాలేజీల్లో భోజనం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం/బోనకల్: విద్యారంగం, విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం బడ్జెట్లో విద్యాశాఖకు 13.5 శాతం నిధులు కేటాయించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎర్రుపాలెం, బోనకల్లో గురువారం ఏర్పాటుచేసిన సమావేశాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యాన ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా భట్టి మాట్లాడుతూ పదేళ్ల పాటు గత ప్రభుత్వం విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచకపోతే, తాము అధికారంలోకి రాగానే డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామని తెలిపారు. విద్యార్థుల సమయాన్ని ఆదా చేయడం, వారికి శ్రమ ఉండొద్దనే భావనతో అమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్పాహారం, జూనియర్ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ ప్రారంభించనున్నామని వెల్లడించారు. అలాగే, జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా భరోసా పథకం అమలు చేస్తామని భట్టి ప్రకటించారు.
రైతులకు అండగా...
ఎర్రుపాలెం మండలం ములుగుమాడు సమీపాన రూ. 36.5 కోట్లతో చేపట్టే కట్లేరు కాల్వల ఆధునికీరణ పనులకు భట్టి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. సాగర్ ఆయకట్టు ఉన్నప్పటికీ ఎర్రుపాలెం మండలంలోని పంటలకు సాగు నీరు అందడం లేదని.. ఇక్కడ ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదించినా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. అంతేకాక సీతారామ ప్రాజెక్టుకు సైతం ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. ఈమేరకు తాము అధికారంలోకి వచ్చాక ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, పోలీసు కమిషనర్ పీ సునీల్దత్, కార్పొరేషన్ల చైర్మన్లు నాయుడు సత్యనారాయణ, రాయల నాగేశ్వరరావు, మార్కెట్, ఆత్మ కమిటీ చైర్మన్లు బండారు నర్సింహారావు, కర్నాటి రామకోటేశ్వరావు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ రమాదేవి, ఎంఈఓ దామాల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, నాయకులు, సర్పంచ్లు, అధికారులు చావా రామకృష్ణ, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, నండ్రు అశ్విని, బొగ్గుల గోవర్దన్రెడ్డి, తుళ్లూరు నిర్మలకుమారి, వేమిరెడ్డి అన్నపూర్ణ, తల్లపురెడ్డి నాగిరెడ్డి, గంటా తిరుపతమ్మ, చింతిరాల ఇమ్మేలమ్మ, గొల్లమందల అనసూర్య, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కొట్టె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


