● త్వరలో ఖమ్మంలోనూ ఏర్పాటు ● ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్
భధ్రాచలం: గిరిజన నిరుద్యోగులకు, మహిళా సమాఖ్యలకు చేయూతనిచ్చేందుకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్కు ఆదరణ లభిస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. గురువారం ఐటీడీఏలోని తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులను రిసీవ్ చేసుకునేందుకు గ్రూప్–4 గిరిజన ఉద్యోగిణిలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. మార్ట్ ద్వారా రోజుకు రూ.లక్ష ఆదాయం వస్తుందన్నారు. ముడి సరుకులకు ఇబ్బందులు లేకుండా జీసీసీ సహకారం తీసుకుంటున్నామని, త్వరలో పాల్వంచ, ఖమ్మం కేంద్రాలలో మార్టులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. భద్రాచలం మినీ స్టేడియం పనులు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. అధునాతన స్టేడియానికి రూ.4 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతి రాగానే పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. సెంట్రల్ లైటింగ్ పనులు టెండర్ అనుకోని కారణాలతో ఆగిపోయిందని, తిరిగి టెండర్లను నిర్ణయించి పనులను పూర్తి చేస్తామని, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని వివరించారు.
స్టేడియానికి 5 ఎకరాల కేటాయింపు
భద్రాచలంటౌన్: భద్రాచలంలో స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. బుధవారం రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంటనే అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని డీవైఎస్ఓ పరంధామరెడ్డిని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ దనియాల వెంకటేశ్వర్లు పంచనామా నిర్వహించి భూమిని క్రీడా శాఖకు అప్పగించారు. సర్పంచ్ పూనెం కృష్ణ, అధికారులు హరీష్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


