ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి రక్షణ కోసం చివరివరకు కృషి చేసిన వనజీవి రామయ్య జీవితం అందరికీ ఆదర్శమని భద్రాద్రి సర్కిల్ అటవీ సంరక్షణ అధికారి(సీసీఎఫ్) డాక్టర్ డి.భీమానాయక్ అన్నారు. జిల్లాకు చెందిన రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘వనజీవి రామయ్య’ చిత్రానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో సన్మానించారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్ ఆధ్వర్యాన వాసవిక్ సేవా ఫౌండేషన్ సహకారంతో సన్మానించగా సీసీఎఫ్ బీమానాయక్ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణకు విశేష సేవలందించిన రామయ్య పద్మశ్రీ అవార్డు సాధించారని గుర్తుచేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రామయ్య జీవితకథ అందరికీ తెలిసేలా సినిమా రూపొందించడం అభినందనీయమన్నారు. అనంతరం డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్, మేయర్ పి.నీరజ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయ ఇన్చార్జి టి.దయాకర్రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వేముగంటి, నిర్మాతలు నిడిగొండ నరేష్కుమార్, లింగంపల్లి చంద్రశేఖర్, నటులు బ్రహ్మాజీ, నాగరాణి, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్, రమణ తదితరులను సత్కరించగా, వనజీవి రామయ్య సతీమణి జానకమ్మకు నిర్మాతలు రూ.లక్ష చెక్కు అందజేశారు.
సీసీఎఫ్ బీమానాయక్


